Monday, September 16, 2013

పాలస్తీనా ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి దగ్గర పోలికలుంటయ్....ఓపిక ఉంటె చదవండి..................................

పాలస్తీనాలో కాలం నిలువెల్లా గాయాలతో పరిగెడుతోంది.. చరిత్ర పుటలకు రక్త తర్పణం చేస్తోంది. లిబర్టీని విగ్రహానికే (స్టాచ్యూ) పరిమితం చేసి, ప్రపంచాన్ని గుప్పిట్లో బంధించాలనుకునే అగ్రరాజ్య పెత్తనం పరోక్షంగా పాలస్తీనాలో రాజ్యమేలుతోంది. ఇలాంటి పరిస్థితులను మార్చి, తమ బతుకులకు భరోసా ఇచ్చే నాయకుడికోసం పాలస్తీనియన్లు ఎదురుచూస్తున్న రోజులవి. అప్పుడే నేనున్నాంటూ వచ్చాడు అరాఫత్. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అధ్యక్షునిగా తన దేశ హక్కుల కోసం, తన వాళ్ల అస్థిత్వం కోసం పోరుబాట పట్టాడు. జియోనిస్టుల దురాగాతాలకు ఎదురొడ్డి నిలిచాడు. విముక్తి కోసం రక్తపాతం తప్పు కాదు, ప్రాణాలు తీసినా, త్యాగం చేసినా మాతృభూమి కోసం తప్పే కాదని నినదించాడు. జాతి జనుల పోరాటానికి వేగుచుక్కై ప్రకాశించాడు. పెద్దన్న కర్రపెత్తనం కింద బానిసల్లా బతుకుతున్న దేశాలకు ఆత్మాభిమానం అనేపాఠం నేర్పాడు.
పాలస్తీనా దుస్థితి...
  పాలస్తీనా.. పశ్చిమాసియాలో మధ్యదరా సముద్రానికి, జోర్డాన్ నదికీ మధ్య ఉన్న భూ భాగం. పాలస్తీనియన్లు అరబ్బులలో భాగమైన జాతి. చరిత్రలో వందలచోట్ల పాలస్తీనా ప్రస్తావన వేల సంవత్సరాలుగా కనిపిస్తుంది. ఈ భూభాగం 19వ శతాబ్దం వరకు అనేక సామ్రాజ్యాలలో భాగంగా ఉంది. జూడాయిజం, క్రైస్తవం, బహాయి, ఇస్లాం లాంటి అనేక మతాలకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రం గా ఉంది. దీంతో ఆయా మతాల వారికి ఈ ప్రాంతంపై ఆధిపత్యం కావాలనే ఆకాంక్షలు బలంగా ఉన్నాయి. అంతే కాదు.. అపారమైన చమురు వనరులున్న గల్ప్ దేశాలకు అత్యంత సమీపంలో కూడా ఉండటంతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యం పెరిగి పోయింది. అదే పశ్చిమాసియా అస్థిరతకు, నిరంతర ఘర్షణలకు, యుద్ధాలకు కారణమై ఆ ప్రాంతాన్ని నివురుగప్పిన నిప్పులా మార్చింది. లక్షలాది పాలస్తీనియన్లను శరణార్థులుగా మార్చి మాతృభూమి నుండి తరిమికొట్టింది. ఇదే క్రమంలో పాలస్తీనా విమోచనా సంస్థ ద్వారా యాసర్ అరాఫత్ చివరిదాకా తన దేశ విముక్తి కోసమే పోరాడాడు. గుండెల నిండా స్వంతంత్రకాంక్ష. వెంట నడిచే లక్షలాది జనం. ఇవే అరాఫత్ ను శక్తిమంతుణ్ని చేశాయి. పాలస్తీనా విషాదగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి. అందుకే అరాఫత్ అంటే పాలస్తీనా స్వేచ్ఛ! అరాఫత్ అంటే పాలస్తీనియన్ల ఆత్మాభిమానం!!
అరాఫత్ పోరాట చరిత్ర..
  19వ శతాబ్దం మధ్యలో పాలస్తీనాను టర్కిష్ ఆటోమన్ సామ్రాజ్యం నుంచి, ఈజిప్ట్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యం చేతిలోకి వచ్చింది. 1897లో జియోనిజం వచ్చింది. యూదులను ఏకం చేసి, వారికి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచటం దీని లక్ష్యం. ఇందుకోసం ప్రపంచంలో ఎక్కడ ఉన్న యూదులైనా, తమ మాతృభూమికి వెళ్లి స్థిరపడాలంటూ జియోనిజం భారీగా వలసలను ప్రోత్సహించింది. బ్రిటన్ ఈ జియోనిస్టు వలసలను బాగా ప్రోత్సహించింది. పాలస్తీనియులు బ్రిటన్ కు వ్యతిరేకంగా పోరాటాలు సాగించినప్పటికీ, రెండో ప్రపంచయుద్ధం ముగిసే వరకూ పాలస్తీనా బ్రిటన్ చేతిలోనే ఉండిపోయింది. చివరికి 1947లో 'పాలస్తీనా మీద అధికారం వదులుకుంటున్నాం' అని చెప్పిన బ్రిటన్, పాలస్తీనాను మూడు భాగాలుగా విడగొట్టింది. ఒకటి అరబ్ రాజ్యం, రెండు యూదుల రాజ్యం ఇజ్రాయెల్, మరొకటి అంతర్జాతీయ సంస్థల అదుపులో ఉండే జెరూసలేం నగరం. అరబ్ నేలలో ఉన్న చమురు కోసం ఆ ప్రాంతంతో మత విధ్వేషాలు రగల్చటాన్ని ఆయుధంగా మార్చుకుంది. ఇజ్రాయెల్ ను అరబ్ దేశాలకు పక్కలో బల్లెంలా తయారు చేసింది. ఇజ్రాయెల్ ఏర్పాటు కావటమే కాదు.. తీర్మానంలో లేని మరో 26 శాతం భూభాగాన్ని కూడా ఆక్రమించింది. ఆ ప్రాంతం నుంచి పారిపోయిన ఏడు లక్షల మంది పాలస్తీనీయులు శాశ్వతంగా శరణార్థులయ్యారు.
1959 పాలస్తీనా విముక్తి కోసం అరబ్ సమాజం చేస్తున్న యుద్దానికి సమాంతరంగా మరో పోరాట రూపాన్ని తీసుకొచ్చాడు అరాఫత్. అదే ఫతా. కువైట్ లో పనిచేస్తున్న పాలస్తీనా సంపన్నులతోపాటు.. ఖతార్, లిబియా, సిరియా లాంటి దేశాలు ఆర్థికంగా ఫతాకు సహకారం అందించాయి. 1962లో కువైట్ నుండి సిరియా వెళ్లాడు అరాఫత్. అక్కడ తన గ్రూప్ ను బలోపేతం చేసుకున్నాడు. 1966 నవంబర్ 13న జోర్డాన్ ఆధీనంలో ఉన్న వెస్ట్ బ్యాంక్ లోని ఓ పట్టణంపై ఇజ్రాయెల్ దాడి కి దిగింది. దీనికి ప్రతిగా ఫతా జరిపిన బాంబు దాడిలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు. 1967లో ఆరురోజుల యుద్ధంలో ఫతా అద్భుతంగా పోరాడిం ఓడింది. యుద్ధంలో ఓడిపోయిన పాలస్తీనియన్ల హృదయాలను ఫతా గెలుచుకుంది. ఫతాతో కలిసి పనిచేసేందుకు పాలస్తీనా రాజకీయపక్షాలు, మిలిటెంట్ గ్రూపులు రెడీ అయ్యాయి. పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ పదవి నుండి అహ్మద్ షుకేరి తప్పుకున్నాడు. ఆ స్థానంలో అరాఫత్ సన్నిహితుడైన యాహ్యా హమ్ముదా ఎన్నికయ్యాడు. పిఎల్ఓ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఫతాకు 33 స్థానాలు దక్కాయి.
ప్రపంచానికి అరాఫత్ పరియం...
  1968 మార్చ్ 21న ఇజ్రాయెల్ దళాలు మరోసారి జోర్డాన్ లోని కరామే టౌన్ పై దాడికి దిగాయి. దాన్ని ఫతా సమర్థంగా తిప్పికొట్టింది. రెండు వైపులా నష్టం జరిగింది. ఇరుపక్షాలు విజయాన్ని ప్రకటించుకున్నాయి. ఈ యుద్ధంతోనే అరాఫత్ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఆనాటి టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై అరాఫత్ ఫొటో వచ్చింది. ఇజ్రాయిల్ ను ఎదుర్కునే నాయకుడు అరాఫతేనని, పాలస్తీనా జాతీయ నేత అతనేని ప్రజలు తమ గుండెల్లో స్థానమిచ్చారు. ఫతాలో ప్రజలు భారీగా చేరారు. కరామే యుద్ధంలో గెలుపు తర్వాత ఫతాతో పాటు మిలిటెంట్ గ్రూపులు జోర్డాన్ లో బలీయంగా మారాయి. పాలన మీద పట్టు పెంచుకుంటున్నాయి.. జోర్దాన్ లో కొంతమంది నాయకులు, అధికారులు పాలస్తీనా మిలిటెంట్ గ్రూపుల పట్ల వ్యతిరేకత చూపారు. ఈ పరిణామం జోర్డాన్ లో అంత్యుద్ధానికి కారణమవుతుందని కింగ్ హుస్సేన్ భావించాడు. దీంతో కేబినేట్ లో పాలస్తీనియన్ వ్యతిరేక మంత్రులను తొలగించాడు. అరాఫత్ ను జోర్డాన్ ప్రధానమంత్రిగా నియమించాడు. అయితే హుస్సేన్ ప్రతిపాదనను అరాఫత్ సున్నితంగా తిరస్కరించాడు. ఏనాటికైనా పాలస్తీనా దేశానికే నాయకత్వం వహిస్తానన్నాడు.
యూఎన్ ఓలో ప్రసంగం...
 1969 ఫిబ్రవరి 3న పిఎల్ఓ ఛైర్మన్ పదవి నుండి హమ్ముదా స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. ఫిబ్రవరి 4న పీఎల్ఓకు అరాఫత్ ఛైర్మన్ అయ్యాడు. రెండు సంవత్సరాల తరువాత పాలస్తీనా రివల్యూషనరీ ఫోర్స్ కు కమాండర్ ఇన్ చీఫ్ అయ్యాడు. 1973లో పిఎల్ఓ రాజకీయ విభాగానికి నాయకుడయ్యాడు అరాఫత్. 1985లో ఐక్యరాజ్యసమితి ప్లీనరీ సమావేశాల్లో అరాఫత్ చేసిన చారిత్రక ప్రసంగం పాలస్తీనియన్ల స్వాంతంత్ర్య కాంక్షను ప్రపంచం ముందు నిలిపింది. ఒక చేత్తో శాంతికి చిహ్నమైన ఆలీవ్ కొమ్మను, దాన్ని కాపాడడానికి మరో చేత్తో తుపాకీని తీసుకొచ్చానన్న అరాఫత్ మాటలు ఐరాస సభ్య దేశాలను కదిలించాయి. పాలనతో సంబంధం లేని నేత యూఎన్ఓ సమావేశాల్లో ప్రసంగించడం అదే మొదటిసారి. ఆ తరువాత 1988లో పాలస్తీనా స్వంతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. మొట్టమొదటి అధ్యక్షుడిగా అరాఫత్ ఎన్నికయ్యాడు. మెజార్టీ ప్రపంచం పాలస్తీనాను దేశంగా గుర్తించింది.
 ఓ వైపు స్వంతంత్ర దేశం కోసం పోరాడుతూనే మరోవైపు ఇజ్రాయెల్ తో సంధికి అరాఫత్ ప్రయత్నించాడు. 1974 నుండే అరాఫత్ కు ఈ ఆలోచన ఉండేది. 1976లో యూఎస్ సెనేటర్ ముందు అరాఫత్ ఓ ప్రతిపాదన ఉంచాడు. వెస్ట్ బ్యాంక్, గాజా నుండి ఇజ్రాయెల్ తప్పుకోవాలి. ఆ ప్రాంతాన్ని ఐక్యరాజ్యసమితి ఆధీనంలో ఉంచాలి. అప్పుడే ఇజ్రాయెల్ దేశంగా ఉండే హక్కును గుర్తిస్తామన్నారు. 1988 డిసెంబర్ లో ఇజ్రాయెల్ ను ఓ దేశంగా చూడాలన్న ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అరాఫత్ ఒప్పుకున్నాడు. ఇదంతా అమెరికాతో అరాఫత్ చర్చల ఫలితమేనని కొంతమంది భావిస్తారు. అయితే పిఎల్ఓ అసలు లక్ష్యమైన ఇజ్రాయిల్ నాశనానికి విరుద్ధంగా అరాఫత్ ప్రవర్తిస్తున్నాడన్న విమర్శలూ వచ్చాయి.
అమెరికా ఆధ్వర్యంలో చర్చలు...
 1990 నుండి ఇజ్రాయెల్ తో ఫతా జరుపుతున్న రహస్య చర్చల ఫలితంగా 1993లో ఓస్లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఐదు సంవత్సరాల పాటు వెస్ట్ బ్యాంక్, గాజాలు పాలస్తీనా పాలనలో ఉంటాయి. ఆ ప్రాంతాల నుండి ఇజ్రాయిల్ క్రమంగా తప్పుకుంటుందనేది ఆ ఒప్పంద సారాంశం. పాలస్తీనా కు సొంత పోలీస్ దళం, పాలనా యంత్రాంగం ఏర్పాటయ్యాయి. ఈ ఒప్పందంపై అరాఫత్, ఇజ్రాయిల్ ప్రధాని ఐజాక్ రాబిన్ సంతకాలు చేశారు. అదే సంవత్సరం నోబెల్ శాంతి బహుమతికి అరాఫత్ ఎంపికయ్యారు. అయితే.. శాంతియుత వాతావరణం ఎంతోకాలం నిలవలేదు. బెంజిమన్ నెతన్యాహూ ఇజ్రాయెల్ ప్రధాని అయినప్పటి నుంచీ పాలస్తీనాతో సంబంధాలు క్షీణించాయి. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించడానికి నెతన్యాహూ అస్సలు ఒప్పుకోలేదు. గత ఒప్పందాలను పట్టించుకోలేదు. అయితే అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ చొరవతో అరాఫత్, నెతన్యాహూ సమావేశమయ్యారు. శాంతి ప్రయత్నాలను కొనసాగించాలని నిర్ణయించారు. 2000 జులై 5న అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. నాటి యూఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, ఇజ్రాయిల్ ప్రధాని ఎహుద్ బరాక్, పాలస్తీనా అధ్యక్షుడు యాసర్ అరాఫత్ వాషింగ్టన్ సమీపంలోని క్యాంప్ డేవిడ్ లో సమావేశమయ్యారు. దశాబ్దాల యుద్ధానికి ముగింపు పలకడం, పశ్చిమాసియాలో శాంతి వాతావరణం నెలకొల్పడం చర్చల ప్రధాన లక్ష్యాలు. ఇజ్రాయిల్ ఏకపక్ష ప్రతిపాదనలకు అరాఫత్ ఒప్పుకోలేదు. ప్రత్యేక దేశంగా గుర్తిస్తామంటూనే పాలస్తీనా అస్థిత్వాన్నే ప్రమాదంలో పడేయాలనుకుంటున్న శత్రువు కుట్రలను అరాఫత్ తిప్పికొట్టాడు. జెరూసలేంను వదులుకునేందుకు సిద్ధపడే అరబ్ నేత ఇంకా పుట్టలేదంటూ చర్చలను బహిష్కరించారు. క్యాంప్ డేవిడ్ పీస్ మీటింగ్ విఫలమయింది. ఇందుకు అరాఫతే కారణమని అమెరికా, ఇజ్రాయెల్ దుష్ప్రచారం ప్రారంభించాయి.
అరాఫత్ జన్మ వృత్తాంతం...
 యాసర్ అరాఫత్ పూర్తి పేరు.. మహమ్మద్ యాసర్ అబ్దుల్ రెహ్మాన్ అబ్దుల్ రవూఫ్ అరాఫత్ అల్ ఖుద్వా అల్ హుస్సేనీ. 1929 అగస్టు 24న అరాఫత్ పుట్టాడు. జెరూసలేంలో పుట్టినట్టు ప్రచారం ఉన్నా... ఈజిఫ్ట్ రాజధాని కైరోనే అరాఫత్ జన్మస్థలమని చరిత్రకారులు నమ్ముతారు. అరాఫత్ తండ్రి పాలస్తీనియన్. తల్లి ఈజిప్షియన్. అరాఫత్ కు ఐదేళ్లున్నప్పుడే తల్లి చనిపోయింది. జెరూసలేం, కైరోల్లో బాల్యం ఎక్కువగా గడిచింది. అరాఫత్ కు తండ్రంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. ఆయన చనిపోయినప్పుడు చూడడానికి కూడా రాలేదు. కనీసం సమాధి వైపు కూడా వెళ్లలేదు. చిన్నతనంలో అరాఫత్ ఎక్కువగా యూదులతో తిరిగేవాడు. వాళ్ల మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అయితే యూదులతో సన్నిహితంగా ఉండడం వల్ల వాళ్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చన్నది అరాఫత్ అభిప్రాయం. అందుకే ఆయన యూదులతో ఎక్కువగా ఉండేవాడు. 1944లో ఈజిప్ట్ యూనివర్సిటీ ఆఫ్ కింగ్ ఫౌద్ లో అరాఫత్ ఇంజినీరింగ్ లో చేరారు. 1948లో అరబ్, ఇజ్రాయెల్ వార్ టైంలో ముస్లిం ప్రపంచానికి అండగా ఉండడానికి యూనివర్సిటీ నుండి డైరెక్ట్ గా యుద్ధరంగానికి వెళ్లాడు. సొంతంగా పోరావాడే కానీ, ఏ పాలస్తీనా ఫిదాయీ గ్రూపులో చేరలేదు. పోరాటానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోయేసరికి తిరిగి యూనివర్సిటీ చేరుకున్నాడు. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేశాడు. 1957లో జాబ్ కోసం కువైట్ వెళ్లాడు. అక్కడే అబూ అయ్యాద్, అబు జిహాద్ అనే పాలస్తీనియన్లతో దోస్తానా కుదిరింది. అరాఫత్ రాజకీయంగా ఎదగడంలో ఈ ఇద్దరి పాత్ర ఎంతో ఉంది. కువైట్ లో పాలస్తీనా శరణార్థులను అరాఫత్ తరుచుగా కలుస్తుండేవాడు. తన మాటలతో వాళ్ల బాధలను కష్టాలను మరిచిపోయేలా చేసేవాడు. 1959 తర్వాత పూర్తి స్థాయిలో తన దేశ విముక్తికోసం పోరాటాన్ని మొదలు పెట్టాడు. జీవితాన్ని అంకితం చేశాడు. ఫతా ను మొదలు పెట్టాడు. 1964 మే 28న పాలస్తీనాను దాస్య శృంఖలాలనుండి విముక్తం చేసి స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పాలస్తీనా విమోచనా సంస్థ ఏర్పడింది. 1969లో పీఎల్ వో చైర్మన్ అయ్యాడు అరాఫత్. సుదీర్ఘ కాలం తమ అస్తిత్వం కోసం, శాంతి కోసం పోరాటం సాగించాడు.
స్వతంత్ర దేశంగా పాలస్తీనా...
  ఇజ్రాయిల్ దురాక్రమణకు వ్యతిరేకంగా, పాలస్తీనా ప్రజల న్యాయమైన పోరాటానికి మద్ధతుగా ఐక్య రాజ్య సమితిలో జరిగిన తీర్మానాలకు లెక్కేలేదు. ఆ తీర్మానాల అమలు ప్రసక్తి వచ్చే సరికి అమెరికా, బ్రిటన్ లు వీటోతో అడ్డుకునేవి. సుదీర్ఘకాల ఘర్షణల తర్వాత 1993లో పిఎల్ వో కు ఇజ్రాయెల్ కు మధ్య ఓస్లో ఒప్పందం కుదిరింది. పిఎల్ వో సాయుధ పోరాటాన్ని విరమించి ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని గుర్తించింది. ప్రతిగా పాలస్తీనీయులకు గాజా నగరంలో, వెస్ట్ బ్యాంకులో జెరికోలో పరిమిత స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. అంటే.. ఒక దేశపు పౌరులను అణచివేసి, నిర్వాసితులను చేసి, వారి మీద నాలుగు దశాబ్దాలకు పైగా యుద్ధం చేసి, చివరికి వారి దేశంలో పదోవంతు భూ భాగం మీద వారికి పరిమిత స్వతంత్ర అధికారం ఇచ్చారన్నమాట! 2001 ఇజ్రాయెల్ ప్రధానిగా ఏరియల్ షరాన్ ఉన్న సమయంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. రమల్లాలోని తన హెడ్ క్వార్టర్ నుండి బయటకు రావద్దని అరాఫత్ ను ఇజ్రాయిల్ హెచ్చరించింది. షరాన్ చర్యలను అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ సమర్థించాడు. దీంతో అరాఫత్ టార్గెట్ గా ఇజ్రాయిల్ రాకెట్ దాడులు చేసేది. రమల్లాలోని హెడ్ క్వార్టర్ పై మిలటరీదాడులు జరిగేవి. అరాఫత్ ను ఇజ్రాయెల్ హౌజ్ అరెస్ట్ చేసింది. కాంపౌండ్ దాటి బయటకు రానిచ్చేది కాదు. ఇజ్రాయిల్ దురాగతాలు కొనసాగుతుండగానే 2004లో అరాఫత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్యారీస్ లోని పెర్సీ మిలిటరీ హాస్పిటల్ చికిత్స పొందుతూ నవంబర్1న తుదిశ్వాస విడిచాడు. పాలస్తీనా స్వేచ్ఛాగీతం మూగబోయింది.. ఓ పోరాట యోధుడి యుగం ముగిసింది. కానీ...
అరాఫత్ మరణం సహజమైందేనా..?
అరాఫత్ ఎలా చనిపోయాడు..? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు.. అనుకున్నట్టుగానే అదో మిస్టరీగా మారింది. అరాఫత్ భార్య, అల్ జజీరా ఛానల్ కలిసి చేసిన పరిశోధనలో అనూహ్యమైన ఫలితాలొచ్చాయి. అరాఫత్ వస్తువులు, దుస్తుల్లో ప్రమాదకర రేడియో ధార్మిక పదార్థం పొలోనియం 210 ఆనవాళ్లు బలంగా కనిపించాయి. ఇది స్లో పాయిజన్ లాంటిది. అదే అరాఫత్ ని బలితీసుకుంది. యాసర్ అరాఫత్ ను చంపితే ఎవరికి లాభమో విడమర్చి చెప్పనక్కర్లేదు. నేటికీ పాలస్తీనా గాయాల దేహంతో స్వేచ్ఛా గీతాన్ని ఆలపించే ప్రయత్నం చేస్తోంది. భిన్నవాదనలతో, ఒప్పందాల ముసుగులో పాగా వేయాలని చూసే 'ఉగ్ర'రాజ్య కుట్రలను ఎదుర్కోవటానికి అరాఫత్ చూపిన పోరాట స్ఫూర్తి పాలస్తీనియన్లను ముందుకు నడిపిస్తోంది...